ముద్ర ప్రతినిధి జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గానికి మరో రెండు కొత్త 33/11kv సబ్ స్టేషన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. మిడ్జిల్ మండలంలోని మున్ననూరు, జడ్చర్ల మండలంలోని పెద్దపల్లి (చిన్నపల్లి) గ్రామాలలో ఈ కొత్త సబ్ స్టేషన్ లను నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. పెద్దపల్లి (చిన్నపల్లి) గ్రామాలలో ఏర్పాటుచేసే సబ్ స్టేషన్ ను రూ 3.56 కోట్ల వ్యయంతోను,మిడ్జిల్ మండలంలోని మున్ననూర్ రూ.3.61 కోట్ల వ్యయంతోను నిర్మించనున్నట్లు ఆయన వివరించారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జడ్చర్ల నియోజకవర్గంలో ఇదివరకే 9 సబ్ స్టేషన్ లు మంజూరు కాగా, ఇప్పుడు కొత్తగా మంజూరైన రెండు సబ్ స్టేషన్ లతో కలిపి నియోజకవర్గానికి కాంగ్రెస్ హయాంలో వచ్చిన సబ్ స్టేషన్ ల సంఖ్య 11 కు పెరిగింది. దీంతో నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు తీరనున్నాయని అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు.