ముద్ర : కాప్రా
మేడారం సమ్మక్క, సారక్క జాతరలో చోటుచేసుకున్న కోవా-బన్ను వివాదం లాంటి ఘటనలు, ప్రచారాలు భారతదేశ ఐక్యతకు, భద్రతకు ప్రమాదం అని జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ పాషామియా స్పష్టం చేశారు. కాప్రా, జవహర్ నగర్ జీహెచ్ఎంసి, చెన్నాపురం-దేవేందర్ నగర్ లో వివిధ ప్రజాసంఘాలు, పార్టీలకు చెందిన నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ముస్లిం కమిటీ కార్యదర్శి టి.కాలేషా అధ్యక్షతన నిర్వహించారు. తమ సామాజిక భాద్యతను విస్మరించి, భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాచి, ప్రజాస్వామ్యాన్ని, విలువలను అపహాస్యం చేసేలా ప్రవర్తించిన వారిపై పోలీసు అధికారులు, పాలకులు, కఠినంగా వ్యవహరించాలని, లేని యెడల ఇదే సంస్కృతిని దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రమాదం ఉందని రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన నాయకులు హెచ్చరించారు. అన్నివర్గాల, మతాల ప్రజల ప్రయోజనాలను, వారి హక్కులను పరిరక్షించే రాజ్యాంగ గ్రంథం పట్ల విశ్వాసం లేకపోయిన ఫర్వాలేదని, కానీ సోదర తత్వాన్ని ద్వంసం చేసే విషపూరిత ప్రచారాలు చేసేవారు ఉగ్రవాదులతో సమానం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్, బీఎస్పీ పార్టీ అధ్యక్షులు, కలకోట ప్రభాకర్, అభ్యుదయ రచయిత షేక్ మీరా, ఏ ఐ ఎఫ్ టి యు అధ్యక్షులు వై మల్లేష్,ఇఫ్టూ జాతీయ కన్వీనర్ షేక్ షావలి, పిఓడభ్ల్యూ(విముక్తి) పెర్క సునీత, ఆప్ తెలంగాణ ఫౌండర్ మహమ్మద్ మోయుద్దిన్, కమిటీ సభ్యులు మహమ్మద్ సోహెల్, మహమ్మద్ గౌస్ బాబా తదితరులు పాల్గొన్నారు.