- అన్నదాతలకు రైతు ‘భరోసా’.
- రికార్డు వేగంతో నిధుల మంజూరు.
- 62.47 లక్షల మంది రైతులకు లబ్ది.
- మూడో విడత కింద రూ.1189.43 కోట్లు విడుదల.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రైతు భరోసా అన్నదాతల్లో ధీమా నింపుతున్నది. వానాకాలం పంటల పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర సర్కార్ ఎకరానికి రూ.6 వేల చొప్పున రికార్డు వేగంతో పంపిణీ చేస్తోంది. తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఏ రోజుకారోజు నిధులను విడుదల చేస్తోంది. వ్యవసాయ శాఖ అందించిన జాబితాల ప్రకారం ఆర్థిక శాఖ రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయాన్ని జమ చేస్తోంది. ఈ నెల 16న రైతు నేస్తం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఒక ఎకరంలోపు 24.22 లక్షల మంది రైతులు, రెండెకరాల లోపు 17.02 లక్షల మంది, మూడు ఎకరాల లోపు 10.45 లక్షల మంది, 4 ఎకరాల లోపు 6.33 లక్షల మంది, 5 ఎకరాల లోపు 4.43 లక్షల మంది ఇప్పటివరకు రైతు భరోసా పథకం ద్వారా లబ్ఢి పొందారు. ఇప్పటివరకు మొత్తం 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ అయినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. నాలుగు రోజుల్లోనే రూ. 6,405 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. కాగా మూడో విడత కింద గురువారం సాయంత్రం వరకు రాష్ట్రంలో ఐదెకరాల్లోపు భూములున్న రైతులందరి వారి బ్యాంకు ఖాతాల్లో రూ.1189.43 కోట్లు జమ అయ్యాయి.