త్వరలోనే 15వేల అంగన్వాడీ పోస్టులు భర్తీ
ప్రభుత్వ పరిశీలనలో జీతాల పెంపు అంశం
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులోనూ అంగన్వాడీలకు ప్రాధాన్యం
ముద్ర, మహబూబాబాద్ :
రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు భర్తీ చేస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15వేల అంగన్వాడీ పోస్టులను త్వరలోనే ప్రకటించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు జీతాలు పెంచే అంశంపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న ఆమె ఆ అంశాన్ని పరిశీలిస్తోన్నట్లు వెల్లడించారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 1368 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లు అందజేశామనీ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37 వేల మందికి ఈ ఫోన్లు పంపిణీ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులోనూ అంగన్వాడీ సిబ్బందికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ టీచర్ల జీతాల్లో కేంద్ర ప్రభుత్వం తన వాటాను పెంచాలని ఇప్పటికే కేంద్రాన్ని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్న ఆమె ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంగన్వాడీ టీచర్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.