ముద్ర కూకట్పల్లి :
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ పనులు, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన, ఐఏఎస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
నల్లా చెరువు వద్ద ప్రజల కోసం మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. ముఖ్యంగా వాకింగ్ ట్రాక్, యోగా సెంటర్, ఇండోర్ స్టేడియం, పిల్లల పార్కులో ఆట పరికరాలు, 30 బెంచీలు మరియు లైబ్రరీని ఏర్పాటు చేయాలని కోరారు. కొనసాగుతున్న రామారావు నగర్ నాలా పనుల్లో భాగంగా, మిగిలి ఉన్న 500 ఫీట్ల మేర స్లాబ్ ఏర్పాటు చేయడానికి తక్షణమే నిధులు విడుదల చేయాలని విన్నవించారు.
మూసాపేట చౌరస్తా నుండి ఆంజనేయ నగర్ వరకు పెండింగ్లో ఉన్న రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
రాజు కాలనీ కమ్యూనిటీ హాల్పై అభ్యంతరం
బాలనగర్ రాజు కాలనీలోని కమ్యూనిటీ హాల్ను ఈఎస్ఐ డిస్పెన్సరీగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పేద ప్రజలకు ఉపయోగపడుతున్న కమ్యూనిటీ హాల్ను వేరే అవసరాలకు కేటాయించడాన్ని సహించబోమని, దానిని యథావిధిగా ప్రజలకే అందుబాటులో ఉంచాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.