ముద్ర ప్రతినిధి, నిర్మల్:
భారత జనగణన–2025 నిర్వహణకు సంబంధించి జిల్లాలోని అధికారులకు ఈ నెల 16న శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జనాభా గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలోని తహసిల్దారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు కోసం ఈ ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ఈ నెల 16 నుండి 18 తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించబడుతుందని తెలిపారు. జనాభా గణనకు సంబంధించిన విధానాలు, సమాచార సేకరణ, పర్యవేక్షణ తదితర అంశాలపై అధికారులకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. శిక్షణా తరగతులలో సంబంధిత అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉన్నందున సోమవారం మార్చి 16న జిల్లా కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లావాసులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.