ముద్ర కూకట్పల్లి :
ముస్లిం మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరీమణుల కోసం ప్రత్యేకంగా అందజేస్తున్న ‘ఈద్ కా తోఫా’ కానుకలను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు.
మూసాపేట డివిజన్ పరిధిలోని మోతీనగర్, బబ్బుగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి రమేష్ ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా కిట్లను అందజేసి, వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగా-జమునా తహజీబ్కు నిలయమైన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకోవడం సంతోషదాయకమని కొనియాడారు.
రంజాన్ పండుగను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో జరుపుకుంటున్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, మజీద్ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు పాల్గొన్నారు.