పట్నంలో ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు
ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: సమసమాజ స్థాపన కోసం అంబేద్కర్ తన జీవితాంతం కృషి చేశారని, మహనీయుడు కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిలు అన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులు, అంబేద్కర్ సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మాట్లాడుతూ బాబాసాహెబ్ ఆశయాలు కొనసాగించడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని చెప్పారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ కృషి అమోఘమని కొనియాడారు. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమని గుర్తుచేసుకున్నారు.
అనంతరం యాచారం మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మహిపాల్, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు, నాయకులు రాజశేఖర్ రావు, రావికుమార్, శ్యామ్, ఐలేష్, శేఖర్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.