6వ తేదీన పోలింగ్ సిబ్బందికి శిక్షణ
జిల్లా ఎన్నికల అబ్జర్వర్ మయాంక్ మిత్తల్, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడి
(ముద్ర ప్రతినిధి – ఉమ్మడి రంగారెడ్డి జిల్లా): మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజెషన్ ప్రక్రియను జనరల్ అబ్జర్వర్ మయాంక్ మిత్తల్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సమక్షంలో పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ఈ ప్రక్రియను నిర్వహించారు. జిల్లాలో నిర్వహించే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను, ఇతర అధికారులతో కూడిన బృందాలను, కౌంటింగ్ సిబ్బందిని ర్యాండమైజెషన్ ద్వారా కేటాయించారు. వీరికి ఇప్పటికే మొదటి విడత శిక్షణను ఎంపిక చేసిన వివిధ కేంద్రాలలో మాస్టర్ ట్రైనర్స్ చే పోలింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. రెండవ విడత పోలింగ్ సిబ్బందికి ఈ నెల 6వ తేదీన వారికి కేటాయించిన కేంద్రాలలో రెండవ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎవరైనా ఎన్నికల విధులకు గైర్హాజరు అయినట్లయితే ఎన్నికల నిబంధనలను అనుసరించి కఠిన చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీపిఓ సురేష్ మోహన్, జీఎం ఇండస్ట్రీస్ శ్రీలక్ష్మి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.