నాగర్కర్నూల్, ముద్ర ప్రతినిధి:
నాగర్కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన శ్రద్ధగా విని, వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 10 అర్జీలు స్వీకరించగా, వాటిలో భూమికి సంబంధించినవి 5, తగు న్యాయం కోరుతూ వచ్చినవి 5 ఉన్నాయి. ఈ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్.ఐలు, సి.ఐలతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల స్థితిగతులను తెలుసుకుని, పరిష్కారానికి సూచనలు ఇచ్చారు.
ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా, మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా తమ సమస్యలను తెలియజేసి, చట్టపరమైన పరిష్కారం పొందేలా పోలీస్ శాఖ కృషి చేస్తోందని తెలిపారు.
ప్రజలకు మరింత చేరువగా ఉండడం, శాంతి భద్రతలను కాపాడడం లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పేర్కొన్నారు.