అండర్–19 ప్రపంచకప్ 2026లో సూపర్–6 దశ చివరి మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఫలితమే గ్రూప్–2 నుంచి సెమీఫైనల్స్కు వెళ్లే జట్లను ఖరారు చేయనుంది. ఈ గ్రూప్లో భారత్, ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లు చివరి నాలుగు స్థానాల రేసులో ఉన్నాయి. అయితే వీరిలో ఇద్దరికే సెమీస్ బెర్త్ దక్కనుంది.
భారత జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో అన్నింటిలోనూ గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ కూడా మూడు విజయాలతో సమానంగా పాయింట్లు సాధించింది. పాకిస్తాన్ మాత్రం మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలతో మూడో స్థానంలో ఉంది. నెట్ రన్రేట్ విషయంలో భారత్ (+3.337) స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా, ఇంగ్లాండ్ (+1.989), పాకిస్తాన్ (+1.484) వెనుకబడ్డాయి.
### పాకిస్తాన్కు కఠిన సమీకరణాలు
ఇంగ్లాండ్ తమ చివరి సూపర్–6 మ్యాచ్ను న్యూజిలాండ్తో ఆడనుంది. ఇప్పటివరకు ఒక్క గెలుపు కూడా నమోదు చేయని న్యూజిలాండ్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఒకవేళ ఇంగ్లాండ్ ఓడితే, పాకిస్తాన్కు కొంత ఊరట లభిస్తుంది. అప్పుడు భారత్పై భారీ తేడాతో గెలిస్తేనే పాక్ సెమీఫైనల్స్ ఆశలు నిలుస్తాయి.
కానీ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ను ఓడిస్తే పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. ఆ గెలుపుతో ఇంగ్లాండ్ సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకుంటుంది. అప్పుడు భారత్, పాకిస్తాన్ మధ్య నెట్ రన్రేట్ పోటీ తేల్చే అంశంగా మారుతుంది. ఈ సందర్భంలో పాకిస్తాన్కు కేవలం విజయం సరిపోదు… భారత్పై భారీ తేడాతో గెలవాల్సిందే.
భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే, పెద్ద స్కోర్ను కట్టడి చేసి 25 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. లేదంటే పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించి, భారత్ను చాలా తక్కువ పరుగులకే పరిమితం చేయాల్సి ఉంటుంది. స్వల్ప తేడాతో గెలిస్తే మాత్రం పాకిస్తాన్ సెమీఫైనల్స్ రేసు నుంచి నిష్క్రమించినట్టే.
ఈ నేపథ్యంలో భారత్ ఓడినా సెమీఫైనల్స్కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉండగా, పాకిస్తాన్ గెలిచినా బెర్త్ అనుమానంగానే మిగలడం ఈ మ్యాచ్కు అదనపు ఉత్కంఠను తీసుకొస్తోంది.