- తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం డిమాండ్.
- భద్రాచలం నియోజక వర్గ మస్జిద్ కమిటీల ఆద్వర్యంలో భారీ నిరసన ర్యాలీ.
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం : వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య డిమాండ్ చేశారు.వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం భద్రాచలం నియోజక వర్గంలోని మస్జిద్ కమిటీల సభ్యులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.నమాజ్ అనంతరం భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ఈ నిరసన ర్యాలీ చేపట్టారు.ఆందోళనకారులు చేతికి నల్ల బ్యాడ్జిలు ధరించి, ప్లకార్డులు చేత పట్టి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీని ఉద్దేశించి పొదెం వీరయ్య మాట్లాడుతూ బిల్లును ఉపసంహరించుకొనే వరకూ ఈ ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు.ఈ ఆందోళనలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు కలిసి రావాలని పిలుపు నిచ్చారు.వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నల్ల చట్టాలను కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, వెంకటాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హుస్సేన్, నియోజక వర్గ మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ ఆరిఫ్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఆలీం, టీడీపీ నాయకులు షేక్ అజీమ్, జామా మస్జిద్ సదర్ షఫీ, కౌసర్ మజీద్ సదర్ అబ్దుల్లా, మస్తాన్ వలి, అలీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.