ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) ఏర్పాటు చేయాలని బసవోజు దేవేంద్రాచారి (వీవీ – రీసెర్చ్ ఎడ్యుకేషన్ రూపకర్త) జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ను నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి అనుకూలమైన ప్రదేశాలను కలెక్టర్ పరిశీలనకు ఆయన సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్కు సమీపంలో నాలుగు దిక్కుల రహదారులతో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని అనుకూలంగా సూచించారు. అదే ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాల (5వ తరగతి వరకు), ఇంటర్ కళాశాల, హాస్టల్ వసతులు ఉండటం వల్ల అన్ని అవసరాలను ఒకేచోట ఏర్పాటు చేసేందుకు ఇది సరైన ప్రదేశమని తెలిపారు.
అలాగే మూడు దిక్కుల రహదారులతో మెయిన్ రోడ్ పక్కన ఉన్న గవర్నమెంట్ ఉన్నత పాఠశాల మరియు అదే ప్రాంగణంలోని ఇంటర్ కళాశాల ప్రదేశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. ఈ ప్రదేశంలోనూ నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యా సంస్థను ఏర్పాటు చేయడానికి అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లలో ఉన్న వసతులను తాను పరిశీలించానని, అక్కడి తరహాలోనే తరగతి గదులు, భవన నిర్మాణాలు, ఆట స్థలాలు, వంటశాలలు, భోజనశాలలు, రవాణా సదుపాయాలు (TPS బస్సులు) వంటి అన్ని సౌకర్యాలతో నాగర్ కర్నూల్లో కూడా పాఠశాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
జిల్లా కేంద్రంలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ నాగర్ కర్నూల్కు మంజూరు చేయాలని కోరారు