Take a fresh look at your lifestyle.

మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహట్కర్

 

ముద్ర, మల్కాజిగిరి

తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ పలు చర్యలు చేపట్టిందని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహట్కర్ అభినందించారు. ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర పోలీస్ శాఖ మహిళ మద్దతు కోసం చేపడుతున్న వివరాలను తెలుసుకొని ప్రశంసించారు. మహిళల ఫిర్యాదులపై సత్వరమే స్పందిస్తూ, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్యాయాలకు అడ్డుకట్ట వేయాలని ఆమె సూచించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గురువారం మేడ్చల్ – మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ‘మహిళా జన సున్వాయి’ (బహిరంగ విచారణ) కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన సుమారు 35 ఫిర్యాదులను ఆమె స్వయంగా పరిశీలించారు. ప్రధానంగా గృహహింస, వేధింపులు, కుటుంబ సభ్యులు వదిలివేయడం , సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు బాధితుల నుంచి అందాయి. ప్రతి కేసును క్షుణ్ణంగా సమీక్షించిన చైర్‌పర్సన్, బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్ సి ఆర్ బి 2023 గణాంకాల ఆధారంగా మహిళలపై పెరుగుతున్న నేరాల సరళిని ఆమె చర్చించారు. దర్యాప్తు ప్రక్రియలో జాప్యం లేకుండా చూస్తూ, పోష్ చట్టం మరియు గృహహింస నిరోధక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. మహిళల భద్రత, గౌరవం విషయంలో రాజీ పడకూడదని, పోలీసు , జిల్లా యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించి మహిళలకు అండగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి, సిఐడి అడిషనల్ డిజిపి చారు సిన్హా, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ కె. అవినాష్ మహంతి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, హైదరాబాద్ అడిషనల్ సిపి ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.