బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా చేసిన అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి గా శ్రీ మాతా నిమిషాంబికా తల్లి భక్తులను అనుగ్రహించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకిగా, ఆదిపరాశక్తిగా పూజలందుకుంటున్న మాత నిమిషములో కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లిగా భక్తులను ఆశీర్వదిస్తోంది. శ్రీ మాతా నిమిషాంబ దేవి అమ్మవారు స్వప్రకాశ జ్యోతి స్వరూపిణిగా సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవతగా ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను తన భక్తులకు మోక్షమూ, సంపదతో కూడిన వరాలుగా అందిస్తూ కోటి దివ్య కాంతులతో దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. గురువారం విజయదశమి సందర్భంగా వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు పర్యవేక్షణచేశారు. నిమిషాంబిక ఆలయ ట్రస్ట్ ధర్మకర్తలు ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్. రామకృష్ణ, బి. హిమచందర్, వై. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకులు చంద్రశేఖర శర్మ, అర్చకుడు ఉమాకాంత శర్మతో పాటు, ఇతర అర్చకస్వాములు భక్తులకు గోత్రనామాదులతో పూజలు నిర్వహించారు.