ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు త్వరగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కే. హేమావతి అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సూచించారు.మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం పై చర్చించి తగు సూచనలు చేశారు. ఓటరు నమోదు పరిక్రియలో బూత్ లెవెల్ అధికారులు బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నందున ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతంగా జరగాలంటే తప్పనిసరిగా రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు, ఎన్నికల బూత్ లెవెల్ అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి పరిశీలించవలసి ఉంటుందని 2002 ఓటర్ జాబితా2025 ఓటర్ జాబితా సరిపోల్చుకొని ఓటర్ జాబితాలో తీసివేతలు కొత్త ఓటర్ నమోదు కు సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేయవలసి ఉన్నందున ఆయా రాజకీయ పార్టీలు త్వరగా బూతు లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని అన్నారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధుల అభ్యర్థన మేరకు బూత్ లెవెల్ ఏజెంట్లకు, బూత్ లెవల్ అధికారులకు శాసనసభ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ఓటర్ నమోదు పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు బిఆర్ఎస్ మోహన్ లాల్, బిజెపి భైరీ శంకర్, కాంగ్రెస్ అనిల్ కుమార్, ఎఐఎంఐఎం మునీర్, కలెక్టరేట్ ఎలక్షన్స్ సూపరింటిండెంట్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.