Take a fresh look at your lifestyle.

రైల్వే జీఎంను కలిసిన ఎంపీ రఘునందన్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ ఎంపీ రఘునందన్ రావు సికింద్రాబాద్ రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కలిశారు. మెదక్ లోక్‌సభ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సదుపాయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. నియోజకవర్గ రైల్వే ప్రణాళికలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ముఖ్యంగా తెల్లాపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఆర్.యు.బి పనుల పురోగతిపై చర్చించారు. అలాగే ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా ఎంఎంటిఎస్ సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ వినతిపత్రం సమర్పించారు.
తెల్లాపూర్ నుండి ఈదుల్ నాగులపల్లి వరకు, తెల్లాపూర్ నుండి ఇక్రిసాట్ వరకు ఎంఎంటిఎస్ విస్తరణ చేయాలని, అలాగే ట్రైన్ల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ఈదుల నాగులపల్లి ప్రాంతంలో రైల్వే టెర్మినల్ ఏర్పాటు చేయాల్సిందిగా జీఎంను కోరారు. ఈ టెర్మినల్ ఏర్పాటు ద్వారా భవిష్యత్తులో రైల్వే రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని సూచించారు.
తెల్లాపూర్ ఎంఐజి ప్రాంతం మధ్యలో ప్రజల రాకపోకలకు సౌలభ్యం కల్పించే విధంగా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని వీలైనంత తొందరగా డీపీఆర్ తయారు చేయాలని కోరారు.
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అక్కన్నపేట రైల్వే స్టేషన్ వద్ద అజంతా ఎక్స్‌ప్రెస్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నిలపాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
సిద్దిపేట జిల్లాలో చిన్నకోడూరులో ఇటీవల మంజూరు చేసిన రైల్వేస్టేషన్ పనులు తొందరగా ప్రారంభించాలని, అన్ని పనులు పూర్తయిన కొమురవెల్లి రైల్వేస్టేషన్ ని తొందరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.