బోడుప్పల్, ముద్ర విలేకరి: సోమవంశ క్షత్రియుల కులదేవతగా బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో వేంచేసివున్న శ్రీ మాతా నిమిషాంబికా అమ్మవారు శ్రావణమాసంలో వచ్చిన వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం స్వర్ణ కవచాలంకృత అలంకరణలో లక్ష్మీశోభతో దేదీప్యమానంగా వెలుగు దివ్వెల కాంతులతో ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని బంగారు చీరలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి వేలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారి అనుగ్రహం పొందారు. ఆలయ ప్రధానార్చకులు చంద్రశేఖర శర్మ, ఇతర అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారి అనుగ్రహం కోసం ప్రార్థనలు జరిపారు.
ఆలయంలో భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, కోశాధికారి ఎన్. రమేష్ , రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు స్వయంగా పర్యవేక్షణ చేశారు. ధర్మకర్తలు ఎస్. గౌరి శంకర్, డి. నర్సింగ్ రావు, ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), బి. హిమచందర్, డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్ . రామకృష్ణ, వై. చంద్రశేఖర్, ఎన్. మోహన్, డి. రామక్రిష్ణ, ఎన్. శ్రీధర్, వెంకట్ రాజారావు, కె. ప్రవీణ్ కుమార్, డి. నరేష్, వై. సత్యనారాయణ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.