మీ తమ్ముడి అవినీతికి సిద్ధమేతే మా తమ్ముడిపై విచారణకు సిద్ధం
హౌస్ కమిటీ వద్దు.. సీఐడీ విచారణ వద్దు..
సిట్టింగ్ జడ్జితో విచారణకు వెళ్దాం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తన తమ్ముడు చేసిన అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హౌస్ కమిటీ విచారణకు సిద్ధమైతే తానూ తన తమ్ముడిపై హౌస్ కమిటీ విచారణకు సిద్ధం అని బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. హౌస్ కమిటీ వద్దు.. సీఐడీ విచారణ వద్దు.. ఇద్దరం కలిసి సిట్టింగ్ జడ్జితో విచారణకు వెళ్దామన్నారు. ఈ విషయంలో విచారణకు రేవంత్ రెడ్డికి దమ్ముందా అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ అవినీతి కి పాల్పడిందని అందరికీ అర్థం అయిందని హరీశ్ రావు చెప్పారు, అందుకే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని చెప్పారు. అందుకే ముఖ్యమంత్రి ఎదురు దాడి చేస్తోందన్నారని ఆరోపించారు. సమాధానం లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో అవినీతిని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు కాబట్టే ఆయన్ను బెదిరిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. అసెంబ్లీలో నోటితో చెప్పలేని భాష మాట్లాడిన రేవంత్ రెడ్డిని ఎథిక్స్ కమిటీ ముందు నిలబెట్టాలన్నారు. మంత్రి తప్పు చేశారని అందరికీ అర్థం అయిందన్నారు. మైనింగ్లో అవినీతిపై సీబీ సీఐడి కాదు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలంటున్నామని హరీశ్ రావు అన్నారు. పొంగులేటి మంత్రిగా ఉంటే విచారణ సజావుగా సాగదన్న హరీశ్ రావు… అందుకే ఆయన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మైనింగ్ అధికారులు మంత్రి పొంగులేటికి రూ. 28 లక్షల జరిమానా విధించారని చెప్పారు. కానీ ఆయన ఆ పెనాల్టీ కట్టలేదన్నారు. కనీసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోలేదన్నారు. సభలో ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి పది తప్పులు చేశారని హరీశ్ రావు చెప్పారు. 20 అంశాలపై విచారణ చేయించాలని స్పీకర్కు లేఖ ఇచ్చామనీ వీటిపైన సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలన్నారు. మైక్ కోసం నాలుగున్నర గంటల పాటు నిలబడ్డాము అయినా మైక్ ఇవ్వలేదని హరీశ్ అన్నారు. పొంగులేటిపై హౌస్ కమిటీ వేసే ధైర్యం మీకు లేదన్నారు. నేడుఉదయం తెలంగాణ భవన్ నుంచి తమ కార్యాచరణ ఉంటుందని అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై తమకు ప్లాన్ ఉందన్నారు.