బోథ్, ముద్ర:
భూగర్భ జలాలు పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోథ్ ఎంపిడిఓ రమేష్ అన్నారు. గురువారం ఆయన జీడిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న నిరవధిక సమతల కందకాల పనిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీల హాజరు విధానాన్ని, పని కొలతలను వివరించారు. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో కూలీలందరూ క్రమశిక్షణతో ఉదయం 6 గంటల లోపు పనికి హాజరై కొలతల ప్రకారము నాణ్యంగా పనులను చేపట్టాలని సూచించాడు. కందకాలలో వర్షపు నీటి నిలువ ద్వారా భూగర్భ జలాలు పెంపొందించుటకు కృషి చేయాలని కూలీలకు సూచించడం జరిగింది. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులకు పలు సూచనలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జగ్దే రావు, ఈసీ మధుకర్ , టెక్నికల్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ రాము, మెట్లు తదితరులు పాల్గొన్నారు.