సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చేసి అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో పరిష్కారం కోసం వచ్చేసిన ప్రజల నుండి మొత్తం 165 దరఖాస్తులు తీసుకున్నట్లు తెలిపారు.అంతకుముందు జిల్లా అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని గురుకులాలు హాస్టల్లో భోజనం, వసతి ఇతరత విషయాలను పర్యవేక్షణ చేయడానికి ఒక జిల్లా, మండల స్థాయి అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగ రాజమ్మ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు