ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:
పట్టణాల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని రవి మహల్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, చైర్పర్సన్ నివేదిత, వైస్ చైర్పర్సన్ షఫీ ఉల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల అభివృద్ధికి బడ్జెట్ ప్రణాళికలను సమర్థవంతంగా రూపొందించి అమలు చేయాలని సూచించారు.
పట్టణ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తెలిపారు. సమావేశంలో మొదటిసారిగా పాల్గొన్న కౌన్సిల్ సభ్యులను అభినందించారు.
‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం’ను మున్సిపాలిటీలలో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. పట్టణం పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. అందుకు మున్సిపల్ సిబ్బంది కృషి చేయడంతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా వార్డుల్లో పర్యటిస్తూ చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రపరచడం, రోడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
పట్టణాన్ని శుభ్రంగా, అందంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
— జిల్లా పౌర సంబంధాల అధికారి, సూర్యాపేట