బీ.సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు
ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు.
సర్వాయి పాపన్న గౌడ్ 316 వ వర్ధంతి సందర్భంగా గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదురుగా గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కలెక్టర్, బిసి కుల సంఘాల ప్రతినిధులు, అధికారులు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోరాట యోధుడు పాపన్నగౌడ్ వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తు చేశారు. అన్యాయాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజుగౌడ్, కల్లుగీత కార్మికుల అధ్యక్షులు రమేష్, వీరేశం, ఆశన్న, వినయ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.