ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలి 24న కలెక్టరేట్ ముందు ధర్నా సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆడివయ్య
ముద్ర ప్రతినిధి, మెదక్:
ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలని, ఫోటో తీసే పద్ధతిలో మార్పు చేయాలని సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆడివయ్య డిమాండ్ చేశారు.
భూ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న రోడ్లు, మైనర్ ఇరిగేషన్ పనులకు నిధులు కేటాయించాలని, జిల్లాలో ప్రజాసమస్యలపై ఈనెల 24న జరిగే కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం మెదక్ లోని కేవల్ కిషన్ భవన్ లో జరిగిన సి.పి.ఎం మెదక్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆడివయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత 15 రోజులుగా సి.పి.ఎం కార్యకర్తలు ప్రజా సమస్యలపై సర్వే చేయగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయని ఆడివయ్య పేర్కొన్నారు. జిల్లాలో అనేక గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు. పని ప్రారంభించిన దగ్గర చేసిన పనికి కూలీ డబ్బులు రావడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేయడం కోసం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్రలు పడుతున్నారని దుయ్యబట్టారు. ఈ కుట్రలో భాగంగానే రెండు పూటల ఫోటోలు తీసే పద్ధతి వల్ల సిగ్నల్ లేక చేసిన పనికి కూలీ రాక పోవడంతో కొందరు పనికి దూరం అవుతున్నారన్నారు. ఎండలు ముదిరిన పని ప్రదేశంలో నీడ, మంచి నీటి సౌకర్యం కల్పించడం లేదని తీవ్రంగా విమర్శించారు. ఉపాధి హమీ పనిపై పూర్తి అనుభవం ఉన్న క్షేత్ర సహాయకులు లేకపోవడంచే పనుల నిర్వహణలో తీవ్ర అలసత్వం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సి.పి.ఎం జిల్లా కార్యదర్శి కె.నరసమ్మ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ.మల్లేశం, కే.మల్లేశం, బాలమని, మహేందర్ రెడ్డి, కార్యవర్గ సబ్యులు నాగరాజు, సంతోష్, ప్రవీణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.