- అఫ్జల్ గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్ళినట్లు గుర్తింపు
- అడ్డదారుల్లో రాయ్ పూర్ కు పారిపోయినట్లు అనుమానం
- రాయ్ పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన ఇక్కడి పోలీసులు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఒకే రోజు రెండు రాష్ట్రాలలోని రెండు ప్రాంతాల్లో కాల్పులు జరిపిన బీదర్ దొంగల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. మొత్తం ఎనిమిది బృందాలతో హైదరాబాద్, రాయ్ పూర్, బీహార్ తో పాటు అనుమానిత ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పులు జరిపింది బీహార్ కు చెందిన అమిత్ కుమార్ గ్యాంగ్ గా గుర్తించారు. బీదర్ లో దోపిడికీ పాల్పడి అక్కడ ఇద్దరిపై కాల్పులకు తెగబడి, హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించి ఇక్కడ నుంచి రాయ్ పూర్ మీదుగా పారిపోవాలని దొంగలు ప్రయత్నించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దొంగలు హైదరాబాద్ కు ఎలా చేరుకున్నారనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు.
కాల్పులు జరిపిన అమిత్ గ్యాంగ్ బీహార్ పారిపోయిందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరపుతున్నారు. గ్యాంగ్ లో కీలకంగా ఉన్న అమిత్ పై బీహార్ లో దోపిడీ, దొంగతనం వంటి పలు కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. సీసీఎస్, టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు అమిత్ నేరాల చిట్టా గురించి ఇప్పటికే తెలుసుకున్నట్లు సమాచారం. అమిత్ గ్యాంగ్ హైదరాబాద్ కు వచ్చి అడ్డదారుల్లో రాయపూర్ కు పారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. కర్ణాటకలోని బీదర్లో అమిత్ గ్యాంగ్ దోపిడీ దొంగలు పట్టపగలే రెచ్చిపోయిన విషయం తెలిసిందే. శివాజీ చౌక్లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై దొంగలు కాల్పులకు పాల్పడ్డారు.
ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు కాల్పులు జరపగా.. భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దుండగులు డబ్బును బ్యాగులో వేసుకుని.. ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయారు. దోపిడీ దొంగలు అఫ్జల్గంజ్లో ఉన్నట్టు తెలుసుకున్న బీదర్ పోలీసులు వారిని పట్టుకునేందుకు హైదరాబాద్ వచ్చారు. అప్జల్గంజ్లో పోలీసులను చూసిన అమిత్ గ్యాంగ్.. తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. అనంతరం రోషన్ ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లిన దుండగులు ట్రావెల్స్ మేనేజర్పైన కాల్పులు జరిపారు. ఈ ఘటన తర్వాత అమిత్ గ్యాంగ్ అఫ్జల్గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వచ్చారు. అక్కడి నుంచి ఎటు వెళ్లారని పోలీసులు గాలిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు రోషన్ ట్రావెల్స్లో రాయ్పూర్కు 3 టికెట్లు బుక్ చేశారు. దాంతో రాయ్పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.