Take a fresh look at your lifestyle.

సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ

  • సింగపూర్ లో బిజీబిజీగా తెలంగాణ రైజింగ్ బృందం
  • నైపుణ్యాల అభివృద్ధికి పరస్పర సహకారం
  • ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌తో సీఎం భేటీ
  • క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ, నిధుల సమీకరణపై చర్చ
  • రేపటి వరకు సింగపూర్​ లోనే సీఎం బృందం
  • కోర్సులు,ప్రణాళికలు,నిర్వహణపై అద్యయనం
  • ఆ దేశ కంపెనీ ప్రతినిధులతో పెట్టుబడులకు ఆహ్వానం

ముద్ర, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ.. సింగపూర్ ప్రభుత్వ ఆధీనంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ)సంస్థతో ఎంఓయు కుదుర్చుకుంది. సింగపూర్​ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి బృందం శుక్రవారం అక్కడి ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న డొమైన్‌ల పనితీరును పరిశీలించింది. ఈ క్రమంలో ఆయా రంగాల్లో పని చేస్తున్న నిపుణులు, సిబ్బందితో రేవంత్ రెడ్డి స్వయంగా సంభాషించారు. హైదరాబాద్​ లోని ఫోర్ల్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా వివిధ కోర్సులు నిర్వహిస్తున్న తీరును మంత్రి శ్రీధర్ బాబు ఐటీఈ అధికారులకు వివరించారు.

నైపుణ్యాల అభివృద్ధి (స్కిల్ డెవెలప్మెంట్) శిక్షణలో భాగస్వామ్యం కోసం పరస్పర సహకారం అందించాలని కోరారు. వీరి అభ్యర్థనలపై ఐటీఈ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది.యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పని చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. అనంతరం ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ వీఎల్ వీఎస్ఎస్ సుబ్బారావు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీఈ సింగపూర్ అకడమిక్, అడ్మిన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్విందర్ సింగ్, ఐటీఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్, జయేష్ రంజన్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించనుంది. కాగా సింగపూర్ ఐటీఈ.. పదో తరగతి చదివే విద్యార్ధుల స్థాయి నుంచి చదువు పూర్తి చేసిన యువత, ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా పరిశ్రమలు,ఐటీ సంస్థల సహకారంతో జాబ్ రెడీ శిక్షణను ఇస్తుంది.

‘స్కిల్స్ ఫర్ ఫూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్’ అనే నినాదంతో పనిచేస్తున్న ఐటీఈలో ప్రస్తుతం 28 వేల మంది శిక్షణ పొందుతున్నారు. మొత్తం వంద ఫుల్ టైమ్ కోర్సులకు ఆన్‌లైన్, క్యాంపస్ శిక్షణ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఐటీఈకి ఐదు వేల పరిశ్రమలతో భాగస్వామ్యం ఉంది. పరిశ్రమలు తమకు అవసరమైన మానవ వనరులకు ఐటీఈలో నేరుగా శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అదే స్పూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తన శిక్షకులకు ఐటీఈతో ట్రెయినింగ్ (ట్రెయినింగ్ ఫర్ ట్రెయినర్స్) ఇప్పించేలా ఒప్పందరం కుదుర్చుకుంది. తాజా ఎంఓయు వల్ల సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాలను మనం ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్ వీ ఎస్ఎస్ సుబ్బారావు ఉన్నారు.

సింగపూర్​ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌తో భేటీ..!

ఈ నెల 16న రాత్రి సింగపూర్‌ చేరుకున్న సీఎం బృందం శుక్రవారం ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌తో భేటీ అయింది. ఈ సమావేశంలో సింగపూర్‌లోని అభివృద్ధి పనులతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రణాళికలపై బాలకృష్ణన్‌, సీఎం రేవంత్‌ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం.. రాష్ట్ర రాజధాని, ముఖ్య నగరాల్లో జరుగుతోన్న అభివృద్ధి కార్యక్రమాలను బాలకృష్ణన్​ కు వివరించారు.

ప్రధానంగా మూసీ పునరుజ్జీవనం, గ్రీన్‌ ఎనర్జీ, పర్యాటకం, ఐటీ, విద్య, నైపుణ్య నిర్మాణంపై చర్చించారు. సింగపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను పోల్చి చూశారు. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ, దాని అవకాశాలపై చర్చించారు. అలానే నిధుల సమీకరణ గురించి చర్చ జరిపారు. కాగా సీఎం బృందం నేడు, రేపు సింగపూర్‌లోనే పర్యటించనుంది. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు నేపథ్యంలో సింగపూర్‌లోని కోర్సులు, ప్రణాళికలు, నిర్వహణను పరిశీలించనుంది. అలానే సింగపూర్‌లోని పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్న సీఎం.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.