Take a fresh look at your lifestyle.

20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి … జ‌నాభాకు అనుగుణంగా  రాష్ట్రానికి ప్రాధాన్య‌త ఇవ్వండి

  • కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ది, హౌసింగ్ శాఖ మంత్రి  మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ కు మంత్రి పొంగులేటి విజ్ఞప్తి
ముద్ర, తెలంగాణ బ్యూరో:- రాష్ట్రానికి  20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ది, హౌసింగ్ శాఖ మంత్రి  మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ కు రాష్ట్ర హౌజింగ్, రెవిన్యూ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో పేద‌ల ఇండ్ల నిర్మాణం జ‌ర‌గలేదన్నారు. దీంతో  ఇండ్ల నిర్మాణానికి ప్ర‌జ‌ల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఉందని… దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన ఇండ్ల‌ను మంజూరు చేయాల‌ని కేంద్రమంత్రి రాసిన లేఖలో ఆయన కోరారు.
మనోహర్ లాల్ ఖట్టర్ ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మంత్రి పొంగు లేటి  ఆయనకు స్వాగతం  పలికారు.అక్కడి నుంచి ఇద్దరు మంత్రులు  కలిసి కరీంనగర్  వెళ్లారు.  కరీంనగర్ నుంచి  హైదరాబాద్ వచ్చిన తర్వాత జరిగిన సమావేశంలో  కూడా  మంత్రి పొంగు లేటి  హౌసింగ్ కు  సంబంధించి ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. 
”గ‌త ప్ర‌భుత్వం గృహ‌నిర్మాణాన్ని పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసింది. హౌసింగ్ విభాగాన్ని నిర్వీర్యం చేసింది. ఉద్యోగుల‌ను ఇత‌ర శాఖ‌ల‌లో స‌ర్ధుబాటు చేసింది. ఈ ప‌రిస్ధితుల‌లో ఏడాది క్రితం అధికారంలోకి వ‌చ్చిన  మా ప్ర‌భుత్వం పేద‌ల ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంది. వ‌చ్చే నాలుగు సంవ‌త్స‌రాల‌లో 20 ల‌క్ష‌ల ఇండ్లు నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ‌ను పున‌రుద్ధ‌రించి, అవ‌స‌ర‌మైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జ‌రిగిందని వివరించారు. స‌ర్వే ప్ర‌కారం రాష్ట్రంలో అర్హ‌త పొందిన ఇల్లు లేని వ్య‌క్తులు సుమారు 44 ల‌క్ష‌ల వ‌ర‌కు  ఉన్నారన్నారు.
ల‌బ్దిదారుల అర్హ‌త‌, జియో ట్యాగింగ్‌, వారి ప్ర‌స్తుత నివాసం వంటి విష‌యాల‌ను డాక్యుమెంటేష‌న్ కోసం ప్ర‌త్యేక మొబైల్ యాప్‌ను రూపొందించామన్నారు. దీనితో ఇంటింటి స‌ర్వే నిర్వ‌హించామన్నారు. 360 డిగ్రీ టూల్‌తో డెస్క్ వెరిఫికేష‌న్ జ‌రిగిందని..ఈ మేరకు తుది జాబితాల రూప‌క‌ల్ప‌న కోసం గ్రామ‌ స‌భ‌లు నిర్వ‌హించామన్నారు.రాష్ట్ర  ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో వేగ‌వంత‌మైన ప‌ట్ట‌ణీక‌ర‌ణ జ‌రుగుతుందని….26 జిల్లాల‌లోని 6867 గ్రామాల‌ను ఇటీవల యూడిఎ కిందికి తీసుకు రావడం జరిగిందన్నారు. వీటిని కేంద్ర ప్రభుత్వ పోర్టల్ లో చేర్చాలని కోరారు.   ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న పేజ్ -1 ప్ర‌కారం దేశ వ్యాప్తంగా రెండు కోట్ల ఇండ్లు మంజూరుకాగా తెలంగాణ‌కు 1.58 ల‌క్ష‌ల ఇండ్లు మాత్రమే మంజూర‌య్యాయన్నారు. ఇది మొత్తం మంజూరులో 0.79 శాతమేనని అన్నారు.  దేశ ప‌ట్ట‌ణ జ‌నాభాలో తెలంగాణ 8 శాతం క‌లిగి ఉందని… ఈ నేప‌ధ్యంలో  రాష్ట్రం మ‌రో 24 ల‌క్ష‌ల ఇండ్ల‌ను పొంద‌డానికి అర్హ‌త క‌లిగి ఉందని లేఖలో పేర్కొన్నారు. అలాగే ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న అర్బ‌న్ ప‌ధ‌కం (2.0)  కింద క‌నీసం 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.