ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి
వరి ధాన్యం తరలింపులో రైతులకు పోలీసులు సహకారిగా ఉండాలని, ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేయాలని పోలీసు అధికారులకు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. జిల్లాలో ఐకెపి కేంద్రాల నుండి వరి ధాన్యం ఎగుమతి, మిల్లర్ల వద్ద దిగుమతి, వరి ధాన్యం రవాణా సౌకర్యం, వరి ధాన్యం అక్రమ రవాణా లాంటి అంశాలకు సంబంధించి ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు పోలీస్ అధికారులతో ఎస్పీ నరసింహ సమావేశం నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు చేశారు. వరి ధాన్యాన్ని తరలించే విషయంలో వాహనాలు సమకూర్చడంలో రైతులకు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు సహకరించాలని, రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. అకాల వర్షాలకు వరి ధాన్యం తడవకుండా రైతులను అప్రమత్తం చేయాలని కోరారు. జిల్లాలోకి అంతర్ రాష్ట్ర సరిహద్దు నుండి అక్రమంగా వరి ధాన్యం ప్రవేశించకుండా నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. అక్రమ రవాణా నిరోధించడంలో భాగంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల నందు పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా పనిచేసేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఇసుక పిడిఎస్ బియ్యం పశువులు వరి ధాన్యం లాంటి అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్, డిసిఆర్బీ డిఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ మగ్దుంఅలీ, ఇన్స్పెక్టర్లు, శివశంకర్, చరమందరాజు, రామకృష్ణా రెడ్డి, రాజశేఖర్, ఎస్సైలు ఏడుకొండలు, శివతేజ, నవీన్ కుమార్, సిబ్బంది ఉన్నారు.