మానవ శరీరంలో ఎక్కువగా వచ్చే గుండెకు సంబంధించిన దడ విషయంలో శ్రద్ధ చూపకపోతే తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని శ్రీ శ్రీ హోలీస్టిక్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ వి ఎస్ రామచంద్ర వెల్లడించారు. నేడు నిజాంపేట్ లోని హాస్పిటల్లో గుండె కొట్టుకోవడంలో తేడాలు ఉన్నవారికి చికిత్స అందించేందుకు అత్యాధునిక పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనే టెక్నాలజీతో చికిత్స అందించే దిశగా ఆసుపత్రిలో ప్రారంభించారు. సాధారణంగా గుండెలో విద్యుత్ ప్రవాహంలో లోపాలు ఉండడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరగడం, తగ్గడం వంటివి రావడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ వంటివి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇటువంటి ప్రమాదాలను గుర్తించి ఈ నూతన టెక్నాలజీ ద్వారా గంట వ్యవధిలోనే చికిత్స అందించి గుండెతో పాటు రక్త కణాలు, ఆహార వాహికకు హాని కలగకుండా శస్త్రచికిత్స చేయవచ్చు అని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలులోకి తీసుకొని వచ్చామని ఈ చికిత్సకు సంబంధించి ఎటువంటి వయసుతో సంబంధం లేకుండా చేయవచ్చు అని అన్నారు. పాత పద్ధతితో పోలిస్తే ఈ చికిత్స చాలా తక్కువ సమయంలో పూర్తవుతుందని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ వాడడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా పూర్తిగా తగ్గుతాయని దానికి తగ్గట్టుగానే చికిత్స ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రకాష్, సీనియర్ కార్డియాలజిస్ట్ గోవింద్, డాక్టర్ భరణి, వారి బృందం ఈ నూతన టెక్నాలజీ ని ప్రజలకు పరిచయం చేశారు.