Take a fresh look at your lifestyle.

అవన్నీ రేవంత్​ ప్రశ్నలే … 80 ప్రశ్నలకు పైగా అడిగారు..

  • అడిగినవే తిప్పి…తిప్పి అడిగారు
  • ఇదో పనికిరాని కేసు
  • ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తా
  • ఇందులో ఎలాంటి కరప్షన్​ లేదు
  • మాజీ మంత్రి కేటీఆర్​ 
  • మీడియాతో మాట్లాడితే మీకెందుకు భయం
  • ఏసీబీ ఆపీస్​ దగ్గర డీసీపీతో కేటీఆర్​ వాగ్వాదం
ముద్ర, తెలంగాణ బ్యూరో :- ఫార్ములా ఈ..కారు రేసింగ్ విచారణలో ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలన్ని….రేవంత్ రెడ్డి  రాసిచ్చినవే అని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్  అని ఆరోపించారు.  మొత్తం 80కి పైగా ప్రశ్నలు అడిగారని…అయితే అడిగిందే తిప్పి…తిప్పి అడిగారన్నారు.  ఇదో పనికిరాని కేసు అని ఆయన మరోసారి వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా పెట్టిన కేసు అని….విచారణ చేస్తున్న అధికారులకు కూడా తెలుసన్నారు.ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్య‌వ‌హారంలో న‌మోదైన ఏసీబీ కేసు విచార‌ణ‌కు  గురువారం కేటీఆర్ తన న్యాయవాది రాంచందర రావుతో కలిసి హాజరయ్యారు.  ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఐదు గంటల వరకు కొన సాగింది. దాదాపు ఆరున్న‌ర గంట‌ల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు.   కాగా  మ‌ధ్యాహ్నం 1.30 గంట‌లకు ఏసీబీ అధికారులు విచార‌ణ‌కు విరామం ఇచ్చారు.
లంచ్ బ్రేక్ అనంత‌రం తిరిగి విచార‌ణ చేశారు.  లంచ్ బ్రేక్ వ‌ర‌కు మూడు గంట‌ల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. కేటీఆర్‌ను ఏసీబీ జాయింట్ డైరెక్ట‌ర్ రుతీరాజ్, అడిష‌న‌ల్ ఎస్పీ శివ‌రాం శ‌ర్మ‌, డీఎస్పీ మాజీద్ ఖాన్ లు విచారించారు. ఫార్ములా ఈ- కార్ రేస్‌లో జరిగిన నగదు చెల్లింపులపై కేటీఆర్‌ను మ‌ధ్యాహ్నం వరకు ఏసీబీ 15 ప్రశ్నలు అడిగిన‌ట్లు స‌మాచారం. ఈ- కార్ రేస్ నిర్వహణలో మీ పాత్ర ఏంటి..? ఆర్గనైజర్స్‌కు నగదు చెల్లింపులు మీ ఆధ్వర్యంలోనే జరిగాయా..? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో చెల్లింపులు ఎందుకు చేశారు..? నగదు చెల్లింపుల్లో క్యాబినెట్ అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు..? హెచ్ఎండీఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు తెలిసే చెల్లింపులు జరిగాయా..? పౌండ్స్ రూపంలో ఇండియన్ కరెన్సీ విదేశీ అకౌంట్‌కు చెల్లించినపుడు ఆర్బీఐ అనుమతి లేదు.. అసలు అనుమతులు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది..? మీరు సక్సెస్ ఫుల్ ఈవెంట్‌గా భావిస్తున్న ఈ కార్ రేస్‌లో ప్రమోటర్స్ ఎందుకు వెనక్కి తగ్గారు..? అని కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం. వాటిన్నంటికి కేటీఆర్  సమాధానమిచ్చారు. సంక్రాంతి తర్వాత మరోసారి కేటీఆర్ విచారణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా  విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన  కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ…. అధికారులు ఎన్నిసార్లు విచారణకు పిలిచాన వస్తానని చెప్పానన్నారు.అలాగే విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పినట్లు తెలిపారు. ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహరంతో తనకు తెలిసిన సమాచారం అంతా ఏసీబీకి చెప్పానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే అటు తిప్పి, ఇటు తిప్పి అడిగారని ఆరోపించారు. ఏసీబీ అధికారులు కొత్త‌గా అడిగిందేమీ లేద‌న్నారు.  ప్ర‌భుత్వం ఒత్తిడిలో మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియ‌ట్లేద‌ని చెప్పానన్నారు. అసంబద్ద‌మైన కేసులో ఎందుకు విచారిస్తున్నార‌ని అడిగినట్లుగా కేటీఆర్ వెల్లడించారు.డ‌బ్బు పంపిన మాట వాస్త‌వ‌మే.. కానీ క‌రప్ష‌న్ ఎక్క‌డుంది అని అడిగానని…అయితే దీనికి ఏసీబీ అధికారుల నుంచి తగు స‌మాధానం లేదని  కేటీఆర్ తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్య‌వ‌హారంలో అర‌పైసా కూడా అవినీతి జ‌ర‌గ‌లేద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోసారి తేల్చిచెప్పారు. ఈ వ్య‌వ‌హారంలో చ‌ర్చించేందుకు నీకు ద‌మ్ముంటే లైడిటెక్ట‌ర్ ప‌రీక్ష పెట్టు అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ స‌వాల్ విసిరారు.  కార్ రేసింగ్  అర‌పైసా కూడా అవినీతి జ‌ర‌గ‌లేద‌న్నారు.
ఈ వ్య‌వ‌హారంలో చ‌ర్చించేందుకు సీఎంకు  ద‌మ్ముంటే లైడిటెక్ట‌ర్ ప‌రీక్ష పెట్టాలని స‌వాల్ విసిరారు.ఆయ‌న‌కు ఉన్న అవ‌గాహ‌న‌,  ప‌రిమిత‌మైన జ్ఞానంతో ఇందులో ఏదో కుంభ‌కోణం జ‌రిగింది అని అనుకుంటున్నార‌ని మండిపడ్డారు.ప‌చ్చ‌కామెర్ల వాడికి లోక‌మంతా ప‌చ్చ‌గ‌నే క‌న‌బ‌డ్డ‌ట్టు.. రేవంత్ రెడ్డి లాంటి దొంగ‌కు అన్నింట్లో కూడా దొంగ‌త‌నం జ‌రుగుతుందన్న భావనలో ఉన్నారని మండిపడ్డారు. అన్నింట్లో పైస‌లు తింటర‌నే దిక్కుమాలిన ఆలోచ‌న రేవంత్ కు ఉండొచ్చు కానీ.. నేను ఒక్క పైసా అవినీతి చేయ‌లేదని స్పష్టం చేశారు.కాగా మీడియాతో కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భంగా డీసీపీ వచ్చి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియా కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీనిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్క‌డ  మాట్లాడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని?  డీసీపీని ప్ర‌శ్నించారు. మీడియాతో మాట్లాడితే భ‌య‌మెందుకు అవుతుంద‌ని నిలదీశారు. అనంతరం తెలంగాణ భవన్ కు కేటీఆర్ చేరుకున్నారు.అక్కడకు వచ్చిన పార్టీ  శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.  కేసుల గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని…ఒక్క రూపాయి కూడా అవినీతి జరగ లేదన్నారు. కేవలం రేవంత్ సర్కార్ తనపై రాజకీయ కక్ష తో పెట్టిన కేసు అని అన్నారు. ఈ తప్పుడు కేసులు ఎక్కువ రోజులు న్యాయస్థానాల్లో నిలువవని అన్నారు.ఖచ్చితంగా మనకు న్యాయం జరిగి తీరుతుందని పార్టీ శ్రేణులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.