నాంపల్లి అగ్నిప్రమాదంపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ‘ఫర్నిచర్ షాపులో మంటలు అదుపులోకి వచ్చాయి. దట్టమైన పొగ ఉండటంతో సెల్లార్లోకి వెళ్లలేకపోతున్నాం. సెల్లార్లోకి వెళ్లేందుకు మరో రెండు గంటల సమయం పట్టవచ్చు. ఇప్పటికే సెల్లార్లోని ఫర్నిచర్ మొత్తాన్ని రెస్క్యూ టీమ్ ధ్వంసం చేసింది. ఫర్నిచర్ భారీగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురైంది. స్థానికు సమచారం ప్రచారం సెల్లార్లో ఐదుగురు ఉన్నారని అనుకుంటున్నాం. భవన యజమానిపై చర్యలు తీసుకుంటాం’ అని ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ స్పష్టం చేశారు. మరోవైపు అగ్నిప్రమాదం నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ నగర ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. నగర ప్రజలు నుమాయిష్ పర్యటనను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాంపల్లి స్టేషన్ రోడ్లో అగ్నిప్రమాద ప్రభావంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడకుండా వాహనాలను ఇతర మార్గాల్లోకి దారి మళ్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని సీపీ తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమన్వయంతో పనిచేశారన్నారు. ప్రస్తుతం భవనంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని తెలిపారు. త్వరలోనే లోపలికి వెళ్తామని తెలిపారు.