- జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణాను భూసమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిష్టాత్మకంగా చేసిన భూభారతి చట్టం-2025, భూభారతి నియమావళి-2025 అమలు అమలు చేసేందుకు జూన్-3 నుండి రాష్ట్ర వ్యాప్తముగా రెవెన్యూ సదస్సులను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. జగిత్యాల జిల్లా లోని మెట్పల్లి మండల కేంద్రంతో పాటు పెద్దాపూర్, ఇబ్రహీంపట్నం మండలం లోని పకీర్ కొండాపూర్ గ్రామాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలలో భాగంగా మెట్పల్లి డివిజన్ లోని అన్నీ మండలాలలోని రెవెన్యూ గ్రామాలలో జూన్-3 నుండి జూన్-20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సులలో అధికారుల బృందాలు రెవెన్యూ గ్రామాల వారీగా సందర్శించి రైతుల నుండి భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని, రైతులందరు భూ సమస్యల అర్జీలతో పాటు సంబంధిత పత్రాలు జత చేసి అధికారులకు ఇవ్వాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో జూన్-3 నుంచి 20 వరకు జరుగబోయే రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ రెవెన్యూ గ్రామాల వారీగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, మెట్పల్లి ఇబ్రహీంపట్నం తహసీల్దారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
