ముద్ర ప్రతినిధి, నిర్మల్:
పక్కవాడికి సాయం చేయని పరిస్థితుల్లో, వయసు చిన్నదైనా తన ఉదారతను చాటుకున్న చిన్నారి నూనెల సాయి సహస్ర ఆదర్శంగా నిలుస్తోంది. నిర్మల్ మండలం రత్నాపూర్ కాండ్లీ బస్సు షెల్టర్ లో గత పది సంవత్సరాలుగా నిరుపేద వృద్ధురాలు ఎల్లమ్మ (70) తన ఏడేళ్ల మనవడితో కలిసి జీవిస్తోంది. కొడుకు, కోడలు మరణించడంతో ఏడేళ్ల మనవడు ఛత్రపతి బాధ్యత కూడా తానే స్వీకరించింది. పని చేయలేని వయసైనా మనవడిని పోషించేందుకు శాయశక్తులా కష్టపడుతోంది. ఆ నోటా ఈ నోటా విషయం తెలుసుకున్న సాయి సహస్ర తన తల్లిదండ్రులతో చర్చించి సహాయం చేయాలని నిర్ణయించింది. 20 కేజీల సన్న బియ్యం, నిత్యావసర వస్తువులు, పండ్లు, బాబుకు రెండు జతల డ్రెస్సులు తీసుకెళ్లి ఆదివారం అందించింది. ఈ సందర్భంగా సాయి సహస్ర మాట్లాడుతూ వీరికి ప్రభుత్వం గుర్తించి తగిన సహాయ సహకారాలు అందించాలని, వృద్ధాప్య పింఛను బాబుకు చదువుకు ఆర్థిక సాయం చేసి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.