ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని , పేదల అభ్యున్నతే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఆందోల్ మండలం అల్మాయిపేట గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
గ్రామసభ తెలంగాణ గీతంతో ప్రారంభమైంది.అనంతరం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని గ్రామ ప్రజలకు చదివి వినిపించారు.వివిధ శాఖల అధికారులు గ్రామాల్లో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల లబ్ధిదారుల వివరాలను వివరించారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి గ్రామంలో మహిళలు,స్వయం సహాయక సంఘాల సభ్యులకు 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని,వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గ్రామంలోని 28 స్వయం సహాయక సంఘాలకు రూ.3.50 కోట్ల రుణాలు అందించగా, రూ.2.50 లక్షల వడ్డీ సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపారు.ఇందిరమ్మ ఇళ్లు, వడ్డీ లేని రుణాలు,రైతు భరోసా,రైతు భీమా,ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ఎన్నో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
అల్మాయిపేట గ్రామంలోని సర్వే నం.513లో కొత్త కాలనీ ఏర్పాటు చేస్తే రహదారులు,నీటి ట్యాంక్,విద్యుత్ సౌకర్యాలు,ఇళ్ల నిర్మాణం వంటి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ,హైవే నుండి అల్మాయిపేట–కొన్యాల వరకు బీటీ రహదారి,అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాలకు మంజూరు చేస్తామని తెలిపారు.
మంజూరైన 7 ఇందిరమ్మ ఇళ్లలో 4 మాత్రమే నిర్మించబడిన నేపథ్యంలో మిగిలిన లబ్ధిదారులు కూడా వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.అవసరమైన ఆర్థిక సహాయం అందించడమే కాకుండా వ్యక్తిగతంగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఇల్లు నిర్మించేందుకు ముందుకు వచ్చే వారికి కొత్తగా ఇళ్ల మంజూరు కూడా చేస్తామని తెలిపారు.అందోల్ ప్రాంతంలో ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేశామని,విద్యార్థులు ఉన్నతంగా రాణించాలని కోరారు.ఆందోల్ నియోజకవర్గంలో త్వరలో ఫార్మసీ కళాశాల స్థాపన జరుగుతుందని,సంగుపేట గుట్ట వద్ద రెండు మూడు పరిశ్రమలు రానున్నట్లు వెల్లడించారు.
పేదలకు చెందిన సుమారు 40 ఎకరాల అసైన్డ్ భూమి తప్పుగా రిజిస్ట్రేషన్ అయిన విషయంపై ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేసి, రిజిస్ట్రేషన్ రద్దు చేసి భూములను అసలు లబ్ధిదారులకు తిరిగి ఇవ్వాలని సూచించారు.
ప్రభుత్వం చేపట్టిన పథకాలు అర్హులందరికీ చేరేలా చూడాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వచ్చే రెండునెలల్లో 10 శాఖల ద్వారా చేపట్టే కార్యక్రమాలలో ప్రజలు చురుకుగా పాల్గొనాలని కోరారు.
ఇందిరా మహిళా శక్తి పథకంతో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని , ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడంతో పాటు కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు.పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
కొత్తగా పిల్లలకు పోషకాహారంతో కూడిన రాగి జావాతో బ్రేక్ఫాస్ట్ పథకం,ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం,ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకాలను ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
అనంతరం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు గృహ నిర్మాణానికి మంత్రి, కలెక్టర్ కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, సర్పంచ్,ఉప సర్పంచ్, ప్రజాప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ.

రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బహుజన చక్రవర్తి శ్రీసర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి,వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వ హిస్తున్నామన్నారు.వారు తెలంగాణ ప్రాంతంలో అందించిన స్ఫూర్తి,త్యాగాన్ని భవిష్యత్ తరాలకు అందించే విధంగా వారు నిర్మించిన కోటలను పర్యాటకంగా,పురావస్తు కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య,అదనపు జిల్లా కలెక్టర్ మాధురి,అదనపు జిల్లా కలెక్టర్(స్థానిక సంస్థలు)పాండు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్,జిల్లా అధికారులు పాల్గొన్నారు.