Take a fresh look at your lifestyle.

నా నియోజకవర్గంలో అక్రమాలు జరిగితే సహించను: సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 294/2లో సుమారు 3 ఎకరాల 20 గుంటల అసైన్డ్ భూమి కేటాయింపుపై వివాదం చెలరేగింది.ఈభూమిని టీజీఐఐసీ పేరుతో కుసుమ్ కుమార్ అనే వ్యక్తికి కేటాయించినట్లు సమాచారం వెలుగులోకి రావడంతో విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కొండాపూర్ మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన రాజ్ మహమ్మద్ సమస్యను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చారు.తక్షణమే ఎమ్మెల్యే స్పందించి బాధితుడు గత 50 సంవత్సరాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని,ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా,సరైన పరిహారం చెల్లించకుండా అధికారుల చర్యలు అన్యాయమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా,పోలీసుల సహకారంతో బాధితుడిని భయభ్రాంతులకు గురిచేస్తూ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని బెదిరించడం, సాగులో ఉన్న కంది పంటను ధ్వంసం చేయడం వంటి చర్యలు పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.రైతు జీవనాధారాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
గతంలో ఏపిఐఐసి ద్వారా ఈ భూమిని ఇతరులకు కేటాయించే ప్రయత్నాలు జరిగాయని, ప్రస్తుతం టీజీఐఐసీ ద్వారా కుసుమ్ కుమార్‌కు కేటాయించినట్లు వస్తున్న సమాచారం అనుమానాలకు తావిస్తున్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.మొత్తం వ్యవహారంలో పారదర్శకత లోపించిందని అభిప్రాయపడ్డారు.
ఈ అంశాన్ని అత్యంత గంభీరంగా పరిగణించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జిల్లా కలెక్టర్‌ కు లేఖ రాసి పూర్తి వివరాలు వెల్లడించారు.అక్రమ భూమి కేటాయింపుపై తక్షణ విచారణ జరిపి,సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని,బాధిత రైతుకు న్యాయం చేయాలని కోరారు.
అదేవిధంగా,భూమి స్వాధీనం, కేటాయింపుల విషయంలో చట్టబద్ధమైన విధానాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. బాధిత రైతుకు సరైన పరిహారం లేదా హక్కుల పరిరక్షణ చేయాలని కోరారు.
“ప్రజల హక్కుల పరిరక్షణలో ఎప్పుడూ ముందుంటు నా నియోజకవర్గంలో ఎవరికైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు”అని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.