సంగారెడ్డి ముద్రా ప్రతినిధి,
ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ మాధురి సంబంధిత అధికారులకు సూచించారు.
మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఎలాంటి తప్పిదాలు లేకుండా మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేయాలన్నారు. బిఎల్ఓ లు మ్యాపింగ్ ప్రక్రియకు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఈఆర్ఓలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమగ్రంగా పర్యవేక్షించి, వేగంగా పూర్తయ్యేలా సహకరించాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న అదనపు కలెక్టర్ మాధురి మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి చేస్తామని తెలిపారు. మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు సూపర్వైజర్లు, బిఎల్ వో లు అంకితభావంతో పనిచేసేలా సంబంధిత మండలాల అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, డీఎం సివిల్ సప్లై అంబాదాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,తహసిల్దార్ లు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.