(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి):
ప్రజావాణి కేవలం దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమంలా కాకుండా సమస్యలు పరిష్కరించే వేదికగా పనిచేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 33 దరఖాస్తులు అందాయి. ఈ మేరకు వివిధ ప్రాంతాల ప్రజల నుండి వివిధ అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు, వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డితో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ద కనబరచాలని ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, వినతులు వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమము కేవలం సమస్యలు విని దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమంలా మారకుండా ప్రతి ఒక్కరు బాధ్యతతో పని చేయాలని సూచించారు. ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే తగిన సమయాలోపు పరిష్కారం చూపాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు సమర్పించడానికి వచ్చిన ప్రజలకు అవసరమైన సూచనలు, సహాయం అందించడంలో అధికారులు సిబ్బంది చొరవ చూపాలని సూచించారు. కాగా, ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ శాఖవి 8, ఇతర శాఖలవి 25, మొత్తం 33 దరఖస్తులు అధికార యంత్రాంగానికి అందాయి. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
——————————————–