ముద్ర ప్రతినిధి, నిర్మల్:
సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం సేవాలాల్ జయంతి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన ఖానాపూర్ పట్టణంలో నిర్వహించనున్న జయంతి వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలన్నారు. జయంతి వేడుకలకు భారీ సంఖ్యలో హాజరయ్యే వారికి తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. వేడుకల ప్రదేశంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. ఉత్సవాలకు హాజరయ్యే ప్రజల రాకపోకలకు అవసరమైన రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు, వాహనాల పార్కింగ్కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు భోజన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. సేవాలాల్ జయంతి సందర్భంగా నిర్వహించే ర్యాలీకి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఆర్డిఓ రత్న కళ్యాణి, వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, తహసిల్దార్ సుజాత, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, గిరిజనాభివృద్ధి శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.