- రాష్ట్రంలో ఉంటోన్న పాకిస్థానీయుల వివరాలు కేంద్రానికి పంపండి.
- మీరు వివరాలిస్తేనే వీసాల రద్దుకు అవకాశం ఉంటుంది.
- సీఎం రేవంత్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్.
- హైదరాబాద్ లో 208 పాకిస్థానీయులు ఉన్నట్లు తేల్చిన పోలీసులు
- పాకిస్తానీలు వెంటనే తెలంగాణ వీడాలి : డీజీపీ జితేందర్.
- ఈ నెల 27 తర్వాత వీసాలు రద్దవుతాయి.
- మెడికల్ వీసా దారులకు ఈ నెల 29 వరకు గడువు.
- అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరమైన చర్యలు.
- కేంద్రం ఆదేశాలతో తెలంగాణ డీజీపీ జితేందర్ హెచ్చరిక.
ముద్ర, తెలంగాణ బ్యూరో: విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతర కారణాలతో రాష్ట్రంలో ఉంటోన్న పాకిస్థాన్ పౌరులను వెంటనే వారి స్వదేశానికి తిరిగి పంపాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.ఈ మేరకు శుక్రవారం ఆయన అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు, పాకిస్తానీయుల (అధికారికంగా, అనధికారికంగా) ఉంటోన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆ దేశస్తులను వెంటనే గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు.అలాగే స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయుల డేటాను కేంద్రానికి పంపించాలని కోరారు.అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు.ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న పాకిస్థానీయులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అందుకు సంబంధించి వివరాలను కూడా సేకరించారు.తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ నగరంలో 208 మంది పాకిస్థానీయులు ఉన్నట్లుగా తేల్చారు.ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు.మరో 48 గంటల్లో పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించారు. మరోవైపు పాకిస్థాన్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలనీ,ఇకపై వారిని భారత్లోకి అనుమతించేదని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడితో హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం..ఈ దాడి వెనక పాక్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది.ఈ నేపథ్యంలో దాయాది దేశంతో దౌత్య సంబంధాలు పూర్తిగా తెంచుకుకుంది.ఇందులో భాగంగానే పాక్ పౌరులకు జారీ చేసిన అన్ని రకాల వీసాలను రద్దు చేసి.. వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.ఈ క్రమంలో దేశంలో ఉంటోన్న పాకిస్దానీయుల వివరాలు సేకరిస్తోంది. వీసాలతో కొనసాగుతోన్న వారందరూ వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అప్రమత్తమైన తెలంగాణ సర్కార్..రాష్ట్రంలో ఉంటోన్న పాక్ పౌరుల వివరాలను సేకరించారు.హైదరాబాద్ లో మొత్తం 208 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 156 మందికి లాంగ్ టర్మ్, 13మందికి షార్ట్ టర్మ్, 39 మందికి బిజినెస్ వీసాలు ఉన్నట్లు తేలింది.
- దేశం వీడకపోతే కఠినంగా వ్యవహరిస్తాం : డీజీపీ జితేందర్.
తెలంగాణలో ఉన్న పాకిస్తానీయులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని రాస్ట్ర డీజీపీ జితేందర్ ఆదేశించారు.ఈ నెల 27వ తేదీ తర్వాత వీసాలు రద్దు చేస్తామన్న ఆయన ఆలోపే వెళ్లిపోవాలని సూచించారు.మెడికల్ వీసా దారులకు ఈనెల 29వ తేదీ వరకూ అవకాశం ఇస్తామని..ఆ తర్వాత క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీళ్లేదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా తెలంగాణలో ఉండాలనుకుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.జల్లెడ పట్టి బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవనీ మెడికల్ వీసాల మీద ఉన్నవారికీ ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉందని ఆయన స్పష్టం చేశారు.లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారికి ఈ నిబంధన వర్తించదని ఆయన వివరించారు.పాకిస్థానీలు తమ దేశానికి అటారి బార్డర్ నుంచి వెళ్లొచ్చని, ఏప్రిల్ 30 వరకు అటారి బార్డర్ తెరుచుకుని ఉంటుందని ఆయన తెలిపారు.
