తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం – ఆసియా పారా గేమ్స్ 2026 భారత జట్టు ఎంపిక కమిటీ సభ్యుడిగా శ్రీ సింగారపు బాబు నియామకం
తెలంగాణ రాష్ట్రానికి మరో విశిష్ట గౌరవం దక్కింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామానికి చెందిన అంతర్జాతీయ పారా సిట్టింగ్ వాలీబాల్ కోచ్ శ్రీ సింగారపు బాబు గారు 2026 ఆసియా పారా గేమ్స్ భారత జట్టు ఎంపిక కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు.
జపాన్లోని ఐచి–నగోయాలో నిర్వహించనున్న 2026 ఆసియా పారా గేమ్స్ కోసం భారత జట్టును ఎంపిక చేసే సాంకేతిక పరిశీలకుడు మరియు ఎంపిక కమిటీ సభ్యుడిగా Paralympic Committee of India (PCI) ఆయనను అధికారికంగా నియమించింది.
2026 ఫిబ్రవరి 26 నుండి 28 వరకు నిర్వహించబడనున్న 14వ జాతీయ పారా సిట్టింగ్ వాలీబాల్ ఛాంపియన్షిప్ (పురుషులు & మహిళలు) సందర్భంగా ఆసియా పారా గేమ్స్కు భారత జట్టు ఎంపిక ప్రక్రియ చేపట్టబడుతుంది. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులను గుర్తించి, సమర్థమైన భారత జట్టును రూపొందించే బాధ్యతను ఎంపిక కమిటీకి అప్పగించారు.
తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల గ్రామం నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, దేశానికి సేవ చేయడం రాష్ట్ర క్రీడా రంగానికి గర్వకారణంగా నిలిచింది. శ్రీ సింగారపు బాబు గారి నియామకం రాష్ట్ర క్రీడాకారులకు మరియు యువతకు ప్రేరణగా నిలుస్తోంది.
తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాకు శ్రీ సింగారపు బాబు గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు