- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణ.
ముద్ర, జగిత్యాల టౌన్: ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 60 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాల 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ, జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లకు కళాశాల బృందం, ఎన్సిసి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కళాశాల ఆవరణలో పూల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాల ఆవిర్భవించి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరూ త్వరలో సమావేశమై 60 వసంతాల ఉత్సవాలను కళాశాలలో ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే లు కళాశాల ఉత్సవాల నిర్వహణకు ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున విరాళాలను ప్రకటించారు. కళాశాల పూర్వ విద్యార్థులు కూడా 60 వసంతాల సందర్భంగా కళాశాల అభివృద్ధికి తమ వంతుగా విరాళాలు, సహాయ, సహకారాలు అందించాలని తెలిపారు. త్వరలో నిర్వహించబోయే ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిలవాలని తెలిపారు. అలగే కళాశాలలో అడ్మిషన్లు పెంపొందించుటకై కావాల్సిన కార్యాచరణ తెలిపారు. కళాశాల ఆవరణలో హాస్టల్ వసతి, ఆడిటోరియం భవన నిర్మాణం, నూతన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు, అధ్యాపక పోస్టుల భర్తీ కి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించి అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అశోక్, కళాశాల పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, పట్టణ తాజా మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
