స్మార్ట్ గా ప్రయాణం
ఆర్టీసీ బస్సులో ఇతర రాష్ట్రాల మహిళల ప్రయాణానికి చెక్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ అడ్రస్తో ఫేక్ ఆధార్ కార్డులను తయారు చేసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న ఇతర రాష్ట్రాల మహిళల అక్రమాలకు చెక్ పెట్టనున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని పొందే మహిళలకు వచ్చే నెల నుంచి స్మార్ట్ కార్డు జారీ చేయనున్నట్లు వివరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మహిళల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఇతర రాష్ట్రానికి చెందిన మహిళలూ లబ్దిపొందుతున్నారన్నారు. దీన్ని చెక్ పెట్టేందుకే స్మార్డ్ కార్డులు తీసుకువస్తున్నామన్నారు. ఇప్పటికే స్మార్ట్ కార్డుల నమూనాగా మూడు డిజైన్లు సిద్ధం చేశామన్న ఆయన వీటిలో నుంచి ఒకదాన్ని ప్రభుత్వం ఫైనల్ చేయనుందని చెప్పారు. స్మార్ట్ కార్డులు వచ్చాక టికెట్ జారీ చేయడం కూడా మరింత సులభం అవుతుందన్నారు.
మార్చి నుంచి ఏసీ, ఈవీ బస్సుల్లో డిస్కౌంట్..
వేసవి సెలవుల దృష్ట్యా వచ్చే వచ్చే నెల ఒకటో తేది నుంచి ఏసీ, మిగతా లగ్జరీ బస్సుల్లో డిస్కాంట్ ఇవ్వబోతున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. వీటిల్లోని టికెట్ ధరలు ఎక్స్ప్రెస్ టికెట్ ధరలతో సమానంగా తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు. పొలుష్యన్ నియంత్రించే భాగంగా ఓఆర్ఆర్ లోపల ఎలక్ట్రికల్ బస్సులే నడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. పీఎంఈ డ్రైవ్ కింద త్వరలో రాష్ట్రానికికి 2,000 బస్సులు రాష్ట్రానికి రాబోతున్నాయన్నారు.