- ములుగు, కామారెడ్డి, ఖమ్మం, నారాయణపేట జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : భూ భారతి చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న మద్దూర్, లింగంపేట, వెంకటాపూర్, నెలకొండపల్లి నాలుగు మండలాల్లో వచ్చిన దరఖాస్తులను క్షుణంగా పరిశీలించి త్వరితగతిన భూ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.భూభారతి అమలుపై సోమవారం ములుగు, కామారెడ్డి, ఖమ్మం, నారాయణపేట జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో తీసుకువచ్చిన భూభారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారానికి మార్గం సులువు అయిందన్నారు. రైతులు ఏ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రెవెన్యూకార్యాలయంలోనే వాళ్ళ సమస్యకు పరిష్కారం లభిస్తుందని.ప్రజల వద్దకే అధికారులు వచ్చి పైసా ఖర్చు లేకుండా వారి భూ సమస్యలను పరిష్కారం చూపిస్తుందని అన్నారు.
- దరఖాస్తులపై లోతైన పరిశీలన
రెవెన్యూ సదస్సు లలో వచ్చిన దరఖాస్తులలో వేటినైనా తిరస్కరించాల్సి వస్తే లోతుగా, క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని. దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని సూచించారు. ఈ రోజు నుంచి తహశీల్ధార్లకు ఆన్లైన్ నమోదు సౌకర్యం కల్పించాం. నాలుగు జిల్లాల పరిధిలో వచ్చిన దరఖాస్తులు, ప్రధాన సమస్యలపై చర్చించి నెలాఖరు కల్లా ఒక పరిష్కారానికి రావాలి. దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి అవసరమైన నైపుణ్యవంతులైన సిబ్బందిని పంపించేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్కు మంత్రిగారు సూచించారు.ఇందిరమ్మ ఇండ్ల విషయంలోకూడా ఎప్పటికప్పుడు అర్హుల జాబితాలను ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు పంపించి ఆమోదం తీసుకోవాలి. అంతేగాక వీలైనంత త్వరగా ఇండ్ల నిర్మాణం ప్రారంభించేలా చూడాలి.ఈ సమావేశంలో సిసిఎల్ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ మకరంద్ పాల్గొన్నారు.