ముద్ర : కాప్రా
చర్లపల్లి బస్టాండ్లో ఏర్పాటు చేసిన మహనీయులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి తొలగించిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.
గురువారం ఉదయం ఈ విషయం వెలుగులోకి రావడంతో వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు చర్లపల్లి బస్టాండ్ వద్దకు భారీగా చేరుకుని నిరసన చేపట్టారు. సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించారు.
ఈ నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చర్యలకు దిగారు. సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డితో పాటు సుమారు 20 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఆందోళనకారులు మాట్లాడుతూ మహనీయుల విగ్రహాలను తొలగించడం అన్యాయం అని, తిరిగి విగ్రహాలను ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతామని తెలిపారు.
అరెస్టు అయిన వారిలో నేమురి మహేష్ గౌడ్, డప్పు గిరిబాబు, కొమ్ము నర్సింగ్ రావు, కడియాల సురేష్ తదితరులు ఉన్నారు. అనంతరం హెచ్బి కాలనీ మాజీ కార్పొరేటర్ జర్రిపోతుల ప్రభుదాస్ పోలీస్ స్టేషన్లో వారిని పరామర్శించారు.