ముద్ర కూకట్పల్లి :
జేఎన్టీయూ ప్రతిష్టను దిగజారుస్తూ, విద్యార్థుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్న చల్లా రామకృష్ణ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వివిధ విద్యార్థి సంఘాలు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశాయి.
స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం, బంజార విద్యార్థి సంఘం, జేఏసీ, బిఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ.. రామకృష్ణ రెడ్డి తన రాజకీయ స్వప్రయోజనాల కోసం అమాయకపు మొదటి సంవత్సరం విద్యార్థులను వాడుకుంటున్నారని ఆరోపించారు. చిన్న విషయాలను పెద్దవి చేసి విద్యార్థులపై తప్పుడు కేసులు పెట్టించడం, కేసులను వెనక్కి తీసుకోకుండా బెదిరించడం, విద్యార్థులను వ్యసనాలకు బానిసలుగా మార్చి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత, గిరిజన విద్యార్థుల పట్ల కుల వివక్ష చూపుతున్నారని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్నా ఆగడాలు కొనసాగుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. వర్సిటీలో రాజకీయ అనుబంధ సంఘాల జోక్యం లేకుండా చూడాలని, వెంటనే రామకృష్ణ రెడ్డి పీహెచ్డీ అడ్మిషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు దిలీప్, భాను ప్రకాశ్, సాయి విశ్వగ్న తదితరులు పాల్గొన్నారు.