వేసవిలో నీటి ఎద్దడి నివారణ పనులకు రూ. 55 లక్షల నిధులు
తాండూరు, ముద్ర :
తాండూర్ మున్సిపల్ తొలి సమావేశంలో 13 అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. సోమవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. తాండూర్ పట్టణ సుందరీకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ ( అర్బన్ )2.0 కింద వాల్ పెయింటింగ్, అవేర్నెస్ ప్రోగ్రాం వంటి పనులు చేపట్టడానికి గాను రూ. 8 లక్షల70,585 లను కేటాయించారు. రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారించేందుకు 11 పనుల కింద రూ 55 లక్షలను కేటాయించారు. జెసిబి మరమ్మత్తులు విడిభాగాల సేకరణ కోసం రూ. 4 లక్షల 86 వేలు, రూ 3 లక్షలు వీధిదీపాలం మరమ్మతు కోసం హైడ్రాలిక్ క్రేన్ సాయము, ఇతర పనుల కోసం చెల్లింపులు చేసేందుకు కౌన్సిల్ తీర్మానించారు. పారిశుధ్య నిర్వహణ వాహనాలను, ఇతర సామాగ్రిని బహిరంగ వేలం నిర్వహించేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపారు. టెండర్ ప్రక్రియ ద్వారా వెహికల్ మౌంటెడ్ హైడ్రాలిక క్రేన్ కొనుగోలు కోసం అంచనారూ. 55 లక్షలు సాధారణ నిధుల నుంచి ఖర్చు చేయుటకు కౌన్సిల్ ఆమోదం తెలిపారు.
ఆదర్శ పట్టణంగా మార్చుదాం : ఎమ్మెల్యే బుయ్యని మనోహర్
తాండూర్ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా మార్చుదామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. కౌన్సిల్ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పట్టణాన్ని పార్టీలకతీతంగా అభివృద్ధి పరుస్తామని ఆయన వివరించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పన కోసం అవసరమైన నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి,డి. ఈ. ఈ ఎస్. మణిపాల్, ఏఈలు కాజా హుస్సేన్, ఉదయ్ కుమార్, లు పాల్గొన్నారు.