పేదలను, వ్యవసాయ కూలీలను మోసం చేస్తున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
పేదలపైన, వ్యవసాయ కూలీల పైన అనేక భారాలను మోపుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, బడ్జెట్లలో తగిన నిధులు కేటాయించకుండా కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ విమర్శించారు. శనివారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన జరగగా ఈ సమావేశంలో నర్సింహ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ దేశంలోని గ్రామీణ ప్రాంత పేదలకు, వ్యవసాయ కూలీలకు కీలకంగా ఉపయోగపడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేసి పేరు మార్చి, బడ్జెట్లో నిధులు కోత విధించి అనేక భారాలు మోపారని విమర్శించారు. అదే బాటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదలను, కూలీలను విస్మరించిందని తెలిపారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం అనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి కొటేషన్ చెప్పి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అందుకు భిన్నంగా బడ్జెట్ ను ప్రతిపాదించారని విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలుకు ఎలాంటి నిర్దిష్టమైన ప్రతిపాదనలు లేవని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వ్యవసాయ కూలీలు, పేదలు సంఘటితంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జెల్లెల పెంటయ్య, గంగాదేవి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు సిరిపంగి స్వామి, సల్లూరి కుమార్, కూకుట్ల చొక్కాకుమారి, కమిటి సభ్యులు అందెల జ్యోతి, దొడ్డి బిక్షపతి, కొండపురం యాదగిరి, మెతుకు అంజయ్య, బొల్లెపల్లి కిషన్, కొమ్ము అంజయ్య పాల్గొన్నారు.