Take a fresh look at your lifestyle.

హస్తినలో కలుద్దాం

 
టి. కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ పిలుపు
నేడు సీఎం సహా కీలకనేతలంతా హస్తినలోనే
నామినేటేడ్ పదవులపైనా చర్చలు

ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హస్తినకు పయనమయ్యారు. మంగళవారం సాయంత్రం ముంబై వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం వరకే ఢిల్లీకి చేరారు.
సీఎంతో పాటు రాష్ట్రానికి చెందిన కీలక నేతలు ఢిల్లీకి వెళ్లారు. గురువారం హైకమాండ్ తో సమావేశం కానున్నారు. కీలక అంశాలపై హైకమాండ్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు కీలక మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, పార్టీ సాధించిన విజయంపై హైకమాండ్‌కు నివేదిక ఇవ్వడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. పార్టీ హైకమాండే కీలక నేతలందరూ రావాలని ఆదేశించినట్లుగా చెబుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి బృందం సమావేశం కానుంది. మున్సిపల్ ఫలితాల అనంతరం స్థానిక సంస్థలైన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణపై వీరు చర్చించనున్నారు. అలాగే, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ లేదా మార్పుల వంటి కీలక అంశాలపై అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందే అవకాశం ఉందని గాంధీ భవన్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

పార్టీ పరమైన కీలక అంశాలపై చర్చించే చాన్స్
పార్టీ పరమైన అంశాలతో పాటు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై కూడా సీఎం దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో జరగనున్న AI సమ్మిట్ లో పాల్గొనడంతో పాటు, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, మెట్రో విస్తరణ వంటి పనులకు నిధుల విడుదలపై ఆయన చర్చలు జరపనున్నారు.
నామినేటెడ్ పదవుల రెండో జాబితా రెడీ ?
రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం.. ఈ పర్యటనలో కేబినెట్ విస్తరణకు సంబంధించిన సీల్డ్ కవర్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందట. ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయి, ఎవరిని తప్పిస్తారు అనే ఉత్కంఠ పార్టీ నేతల్లో నెలకొంది. అలాగే, ఈ పర్యటన ముగిసిన వెంటనే నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల కావచ్చని సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వారికి అవకాశం కల్పించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.