ఉత్తర భాగానికి పూర్తి క్లియరెన్స్
ఈ నెలాఖరులోగా అన్ని అనుమతులు
త్వరలోనే మొదలుకానున్న పనులు
ముద్ర, తెలంగాణ బ్యూరోొ :
హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం పనుల్లో ముందడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్రం జాతీయ నంబర్ కేటాయించగా.. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మరో 15 రోజుల్లో పూర్తి స్థాయి అనుమతులు వస్తాయని.. వెంటనే పనులు ప్రారంభిచనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మెుత్తం 161 కి.మీ ఈ భాగం నిర్మించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఉత్తర భాగం పనులు చేపట్టడానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తిచేసింది. ఈ భాగం రహదారికి NH-161AA నంబరును కేటాయించింది. మరో 15 రోజుల్లో ఈ ప్రాజెక్టు పనులకు పూర్తిస్థాయి అనుమతులు కూడా వచ్చే అవకాశాలున్నాయని రాష్ట్ర అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర భాగాన్ని మొత్తం 161.5 కి.మీ. మేర 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా నిర్మిస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడ్పల్లి వరకు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.20,737 కోట్లను ఖర్చు చేస్తోంది. త్వరలోనే ఈ ఉత్తరభాగం పనుల ప్రారంభానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తుందని నేషనల్ హైవే వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం పనులపై మాత్రం సందిగ్ధత నెలకొంది. ఈ భాగం పనులను కేంద్రం చేపడుతుందా..? లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు తీసుకెళ్తుందా..? అనేదానిపై పూర్తి స్థాయి స్పష్టత రావడం లేదు. ఉత్తర భాగం పనులతో సమాంతరంగానే దక్షిణ భాగం పనులను చేపడతామని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఓవైపు ఈ పనులను కూడా చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూనే.. అవసరమైతే తామే చేపడతామని రేవంత్ సర్కార్ అనేక సందర్భాల్లో వెల్లడించింది. దక్షిణ భాగం పనుల కోసం కన్సల్టెన్సీ డీపీఆర్నూ సైతం సిద్ధం చేసి పెట్టింది. ఇందులో మూడు ప్రతిపాదనలు చేసింది. ఫైనల్గా యాదాద్రి భువనగిరి జిల్లా తంగడ్పల్లి నుంచి సంగారెడ్డి వరకు మొత్తం 201 కి.మీ. హైవేను గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేయాలని డిసైడ్ అయింది.
యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల మీదుగా రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగం నిర్మాణం చేపట్టాలని డీపీఆర్లో వెల్లడించారు. ఇందుకోసం సుమారు 2,010 హెక్టార్ల భూసేకరణ అవసరమని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఆదిభట్ల ఏరోసిటీ ప్రాంతాలను కలిసేలా ఈ హైవే ఫైనల్ ఎలైన్మెంట్ను రూపొందించారు. NH-65, 163, 44, 76, NH-19 రహదారులను కలిపేలా రోడ్డును ప్రతిపాదించారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ దక్షిణ భాగం పనులకు సుమారు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా.