Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ స్థానాలు 175.. ఎంపీ స్థానాలు 25? డీలిమిటేషన్‌తో మారనున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రం

అసెంబ్లీ స్థానాలు 175
ఎంపీ స్థానాలు 25..?
నియోజకవర్గాల పునర్విభజన
గణత తర్వాత డీలిమిటేషన్
లక్ష్మణ్ వ్యాఖ్యలతో కొత్త చర్చ

ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో త్వరలో నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరగనుంది. బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మరో ఆరు నెలల్లో జనగణన పూర్తయ్యాక పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనివల్ల రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం ఉన్న 119 నుండి కనీసం 153కి, పార్లమెంట్ స్థానాలు 17 నుండి 23-25 వరకు పెరిగే అవకాశం ఉంది. పెరిగిన స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కూడా అమలు కానున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ద్వారా రాజకీయ సుస్థిరత సాధించాలని కేంద్రం భావిస్తోంది. జనాభా ప్రాతిపదికన జరిగే ఈ మార్పులతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.

మారుతున్న ముఖచిత్రం
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం త్వరలో పూర్తిస్థాయిలో మారిపోనుంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తలపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియతో రాష్ట్రంలో అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాల సంఖ్య భారీగా పెరగనుంది. ఈ పరిణామాలపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తాజాగా కీలక సమాచారాన్ని పంచుకున్నారు. దేశవ్యాప్త జనగణన (సెన్సస్) ప్రక్రియ రాబోయే ఆరు నెలల్లోనే పూర్తవుతుందని.. ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, వచ్చే ఎన్నికల నాటికే మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణలో ప్రజాప్రతినిధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కలు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని నిబంధనలను బట్టి ఈ మార్పులు ఎలా ఉంటాయంటే.. ప్రస్తుతం తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజన చట్టం ప్రకారం వీటిని కనీసం 153కు పెంచాలని ప్రతిపాదించారు. అంటే 34 కొత్త స్థానాలు అదనంగా రానున్నాయి. అయితే జనాభా పెరుగుదల ప్రాతిపదికన ఈ సంఖ్య 161 నుండి 175 వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 19 లక్షల జనాభాకు ఒక ఎంపీ స్థానం ఉండాలి. డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య 23 నుండి 25కు పెరిగే అవకాశం ఉందని అంచనా.

పెరుగనున్న మహిళా ఎమ్మెల్యేలు
గతంలో ప్రతి లోక్ సభ స్థానానికి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండేవి. పెరిగిన జనాభా దృష్ట్యా ఒక్కో ఎంపీ స్థానం పరిధిలోకి 8 నుండి 9 అసెంబ్లీ స్థానాలను చేర్చే యోచనలో కేంద్రం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 153కు చేరితే.. అందులో 51 స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. దీనితో పాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల స్వభావం కూడా జనాభా లెక్కల ఆధారంగా మారుతుంది. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించడం వల్ల రాజకీయంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో.. ప్రస్తుతమున్న ప్రాతినిధ్య రేషియోను దెబ్బతీయకుండా సీట్లను పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం అసెంబ్లీకి ఒకసారి, పార్లమెంట్‌కు మరోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వల్ల తెగిపోయిన ఈ బంధాన్ని మళ్ళీ కలపాలని బీజేపీ భావిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి (జమిలి ఎన్నికలు) జరిగితే జాతీయ అంశాల ప్రభావం రాష్ట్ర ఎన్నికలపై కూడా ఉండి.. తమకు మేలు జరుగుతుందని బీజేపీ వ్యూహకర్తల అంచనా.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన 8 స్థానాలు ఈ నమ్మకాన్ని మరింత బలపరిచాయి. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని వివరించారు. కిచెన్ కేబినెట్లలో నిర్ణయాలు తీసుకునే కుటుంబ పార్టీల సంస్కృతి తమది కాదని.. 12 ఏళ్లు క్రైయాశీలక సభ్యుడిగా ఉన్న ఏ సామాన్య కార్యకర్త అయినా జాతీయ స్థాయికి ఎదగవచ్చని పేర్కొన్నారు. నితిన్ నబీన్ వంటి నేతలే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు.

Leave A Reply

Your email address will not be published.